పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం


మున్సిపల్‌ పరిధిలో దోమల నివారణ 


మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్‌


జనగామ,డిసెంబర్‌31(జనం సాక్షి) : మున్సిపల్‌ పరిధిలో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ద్వారా పట్టణంలోని రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో జనగామపట్టణంమరింత అందంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా అందుకు బాధ్యతగా సాగాలన్నారు. దోమల నివారణకు మురుగు కాలువలు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేసేవారికి జరిమానా విధించాలన్నారు. హరితహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. కొత్తచట్టంలో కలెక్టర్లకు విస్తృత అధికారులు ఇచ్చారని, ఎలాంటి తప్పులు జరిగినా సంబంధిత అధికారులతోపాటు కలెక్టర్లను కూడా బాధ్యులు చేసే విధంగా చట్టం ఉందన్నారు. కొత్త చట్టంపై ప్రతి అధికారి, సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని, లేకుంటే 


ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. నాటిన మొక్కల్లో ఒక్కటి ఎండినా.. దానికి సంబంధిత ప్రత్యేకాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణకు హరితహారంలో పట్టణంలో మొక్కలు నాటే టార్గెట్‌, కొత్త పురచట్టం కఠినతరంగా ఉన్న నిబంధనలు, మొక్కలు ఎండిపోతే శాఖాపరంగా తీసుకునే చర్యలు, ఇప్పటి వరకు నాటిన మొక్కలకు నీటి సరఫరా, సంరక్షణ చర్యలపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తమ పరిధిలో ఒక్క మొక్క ఎండిపోయినా బాధ్యుడిపై వార్డు అధికారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలో ఏడాది చొప్పున ఐదేళ్ల ప్రణాళికతో కొత్త నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, కొద్దిరోజుల్లోనే అన్ని వార్డుల్లో 


పచ్చదనం పెంచేందుకు అధికారులు, విభాగాల అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్‌ అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యుడైన ఇన్‌చార్జి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తనిఖీలు చేసిన సమయంలో సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం కనిపించినా..ఫిర్యాదులు వచ్చినా సంబంధిత వార్డు ఇన్‌ఛార్జి అధికారిపై వేటు పడుతుందని స్పష్టం చేశారు. వార్డుల వారిగా మొక్కలను నాటడంతోపాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలని, వీటి లెక్కలు పక్కాగా ఇన్‌ఛార్జిల వద్ద ఉండాలని ఆదేశించారు. సంరక్షణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.