13న కేసీఆర్‌, జగన్‌ భేటీ

రాజధానిపై గందరగోళ సమయంలో ఆసక్తికర భేటీ
- గోదావరి నీటి తరలింపు, ఇతర సమస్యలపై చర్చించే అవకాశం 
హైదరాబాద్‌, జనవరి7(జనంసాక్షి) : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు భేటీకానున్నారు. ప్రగతి భవన్‌ వేదికగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం, ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ రాజధాని తరలింపునకు ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశంకానుండటం ఆసక్తి రేపుతోంది. భేటీలో విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలు, శ్రీశైలానికి గోదావరి నీళ్ల తరలింపుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గోదావరి-కృష్ణా అనుసంధానంపై 
ఇప్పటికే ఇద్దరు సీఎంలు చర్చించారు.. కానీ ఎలాంటి క్లారిటీకి రాలేకపోయారు. ఈ సమావేశంలో ఇదే అంశంపై ఫోకస్‌ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాజధానిపై రగడ జరుగుతున్న సమయంలోనే ఈ సమావేశం జరగనుండటంతో.. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పటికే రెండు, మూడుసార్లు సమావేశమయ్యారు. విభజన చట్టం, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. కొన్నిటికి పరిష్కారం దొరికినా.. మరికొన్ని మాత్రం అలాగే పెండింగ్‌ ఉండిపోయాయి. దీంతో ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా క్లియర్‌ చేయాలని భావిస్తున్నారు. మరి ఈ భేటీలో సీఎంలు ఎలాంటి చర్చలు జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది.