అరెస్ట్‌లతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు


లేఖ విడుదల చేసిన జనసేనాని పవన్‌
అమరావతి,జనవరి7(జనంసాక్షి): అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. చినకాకాని వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు పవన్‌ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరబాటే అవుతుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, అటు పరిపాలన రాజధాని విషయంలో విశాఖ వాసులు కూడా సంతృప్తిగా లేరని ఆరోపించారు. ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.