గ్రేటర్‌ ఎన్నికల్లో ముగిసిన ప్రచారం

సాయంత్రం 6కల్లా చాపచుట్టేసిన పార్టీలు
ఎక్కడిక్కడే బందయిన మైకులు
ఇంటింటి ప్రచారంపై పార్టీ నేతల దృష్టి
మూతపడ్డ మద్యం షాపుల..బార్లు
హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి) : హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు మంగళవారం జరిగే ఎన్నికలకు సంబంధించి ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసింది.ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ఆరుగంటలకల్లా ప్రచారం ముగించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా తక్కువ సమయం ఇచ్చినా ఆయా పార్టీలో దూకుడుగా ప్రచారం నిర్వహించాయి. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో ఆయా పార్టీ అభ్యర్థుల మైకులన్నీ సాయంత్రం 6 గంటల తర్వాత మూగబోయాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మరోసారి గ్రేటర్‌ పీఠం నిలబెట్టుకోవాలని అధికార తెరాస భావిస్తుండగా, ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని భాజపా కృతనిశ్చయంతో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని, అవకాశం వస్తే గతంలోలాగా మేయన్‌ పీఠం దక్కించుకోవాలని ఎంఐఎం వ్యూహం పన్నుతోంది. డిసెంబరు 1న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రజలు ఎవరివైపు మొగ్గుచూపను న్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బ్యాటెల్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, పార్టీల నేతలు, కార్యకర్తలు గడువు సమయంలోపే జీహెచ్‌ఎంసీ పరిధిని వదిలి వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్‌ రోజు డిసెంబరు 1 సాయంత్రం 6 వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. చివరి రోజు కావడంతో ప్రచారంలో ఆయా పార్టీలు జోరు పెంచాయి. ఆదివారం ¬మంత్రి అమిత్‌ షా ప్రచారం చేశారు. సాయంత్రం వరకు సమయం ఉండడంతో నగరంలో వివిధ డివిజన్లలో పార్టీలు ప్రచారన్ని ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే నోటిఫికేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు 15 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల తరఫున ప్రదాన ప్రచారకులు ప్రచారం నిర్వహించారు. బిజెపి నుంచి అత్యధికంగా నేతలు వచ్చి వెళ్లారు. కేంద్రమంత్రులు గ్రేటర్‌ ప్రచారంలో బాగా పాల్గొన్నారు. ఈ క్రమంలో మాటల తూటాలు పేలాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ,ఎంఐఎంలు ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలిపాయి. పట్టు నిలుపుకునే దిశగా టిఆర్‌ఎస్‌, పట్టుకోసం బిజెపి వ్యూహం పన్నడంతో ఈ రెండు పార్టీల మధ్యనే బాగా ప్రచారం సాగింది. ఇరు పార్టీల మధ్య నువ్వానేనా అన్నరీతిలో ప్రచారం సాగింది. సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్డకా డబ్బులు పంచుతున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బ్యాలెట్‌ పత్రంలో తమ పార్టీ గుర్తు ఎక్కడుందో చూపే కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలావుంటే ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటించని రాజకీయపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం. అశోక్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసి యాక్ట్‌, 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంద న్నారు. ఇదిలావుంటే అమిత్‌షా పర్యటనతో ఎన్నికల్లో ఫుల్‌జోష్‌ వచ్చిందని , గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం 
సాధిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన  మాట్లాడుతూ.. ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం.. ఏ ఎన్నికల్లో కనిపించలేదని అన్నారు.  జాతీయ నాయకులు ఎందుకొచ్చారని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారని వారి ఆటలు సాగవన్నారు.  మాది కుటుంబ పార్టీ కాదు... ప్రజాస్వామ్య పార్టీ అని తెలిపారు.