కొమురంభీమ్‌ జిల్లాలో పులిపంజా


పశువుల కాపరిపై దాడి,హత్య


ఘటనతో సవిూప గ్రామాల ప్రజల భయాందోళన


కొమురం భీం,నవంబర్‌11( జనం సాక్షి ): కొమరం భీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పులి పంజా విసిరింది. ఇంతకాలం పశువులపైనే దాడులు చేస్తున్న పులి తొలిసారిగా ఓ పశువుల కాపరిని పొట్టన పెట్టుకుంది. దహేగాం మండలం దిగేడ అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడితో కలకలం రేగింది. పెద్దపులి దాడిలో యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడిని పెద్దపులి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని వాపోతున్నారు. మంగళవారం పొలంలో పనిచేసుకుంటున్న విఘ్నేష్‌ అనే యువకుడిపై పులి హఠాత్తుగా దాడి చేసింది. అనంతరం అతడ్ని చంపి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విఘ్నేష్‌ మృతుదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పులి దాడితో చుట్టు ప్రక్కలి గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్‌ లైఫ్‌ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ధికారులుగుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం లోని బండవిూది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి.కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది.