కోవాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌


అలీఘడ్ముస్లిం యూనివర్సిటీలో ప్రయోగాలు


లక్నో,నవంబర్‌11(ఆర్‌ఎన్‌ఎ): కరోనా వ్యాక్సిన్‌ 'కొవాగ్జిన్‌' మూడో దశ క్లినికల్‌ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ లో ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ తారిఖ్‌ మన్సూర్‌ ట్రయల్స్‌లో తొలి వలంటీర్‌గా పేరును నమోదు చేసుకున్నారు. 'కొవాగ్జిన్‌' ఫేజ్‌-3 ట్రయల్స్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నట్లు ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. టీకాను పరీక్షించేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. భారత్‌ బయోటెక్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కొవిడ్‌-19 టీకాను అభివృద్ధి చేస్తోంది. కాగా, ట్రయల్స్‌లో పాల్గొంటున్న వలంటీర్లకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణ ఖర్చులతో పాటు ఇతర ప్రయోజనాలు పొందుతారని ఏఎంయూ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్‌ను 100 మంది వలంటీర్లకు ఇచ్చారు. మూడో విడతలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 25 ప్రాంతాల్లో సుమారు 26వేల మంది వలంటీర్లపై టీకాను పరీక్షించాలని భారత్‌ బయోటెక్‌ నిర్ణయించింది. ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) భారత్‌ బయోటెక్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.