ఐకార్‌ ప్రవేశ పరీక్షలో అటవీకళాశాల సత్తా

పలు ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులు


హైదరాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఐకార్‌ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్ధులు సత్తాచాటారు. మొత్తం పది మందికి టాప్‌ ర్యాంకులు వచ్చాయని కళాశాల డీన్‌ చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. మంచి ప్రతిభతో ర్యాంకులు సాధించిన విద్యార్ధులను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభ ఇతరఅధికారులు అభినందించారు. ఐసీఏఆర్‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర అటవీకళాశాల, పరిశోధనా సంస్థ విద్యార్ధులు బి. వెంకటేశ్వరరెడ్డి ఓపెన్‌ కేటగిరీలో మూడో ర్యాంకు, హుస్నా తక్వీం ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నారు. సీహెచ్‌ భార్గవి ఓపెన్‌ కేటగిరీలో 14వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఎనిమిదో ర్యాంకు సాధించారు. దివ్యాంగుల కేటగిరీలో అమిత్‌రెడ్డి మొదటి ర్యాంకు దక్కొంచుకోగా, ఎస్సీ కేటగిరీలో ఇందుకాలే, అనిష్‌ ఐదు, ఆరు ర్యాంకులను సాధించారు. తేజశ్రీ ఓబీసీ కేటగిరీలో ఆరోర్యాంకు దక్కించుకోగా, పి.కళ్యాణి ఓపెన్‌ కేటగిరీలో 29వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 15వ ర్యాంకు పొందారు. డె¬డూన్‌లోని ఎఫ్‌ఆర్‌ఐ, బనారస్‌ హిందూ యూనివర్శిటీ, ఐసిఏఆర్‌, ఏఐఈఈఏ పిజీ పరీక్షల్లోనూ ఎఫ్‌సీఆర్‌ఐ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించారు. 2016లో ఏర్పాటు చేసిన ఎఫ్‌సీఆర్‌ఐ కాలేజీలో బీఎస్సీ పారెస్ట్రీ మొదటి బ్యాచ్‌ విద్యార్ధులు 2020, జూన్‌లో విజయవంతంగా కోర్సు పూర్తిచేశారు. కోర్సు పూర్తిచేసుకున్న వారందరికీ ఎమ్మెస్సీ ప్రవేశాల కోసం మంచి విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు దక్కాయి. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లోనూ ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్ధులు అవకాశం దక్కించుకున్నారు. అలబామాలోని అబర్న్‌ యూనివర్శిటీలో ఎఫ్‌సీఆర్‌ఐకి చెందిన సూర్య దీపిక, సుహర్ష ప్రవేశాలు పొందారు. విద్యార్ధుల విజయం వెనుక బోధనా సిబ్బంది కృషి ఉందని, వారికే ఈ ఘనత దక్కుతుందని కళాశాల డీన్‌ డాక్టర్‌ చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.