మిడ్‌మానేరు బాధితుడికి ప్రవీణ పరామర్శ

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఎస్పీ నేత

కరీంనగర్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన మిడ్‌ మానేరు భూ నిర్వాసితుడు రాజయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సోమవారం పరామర్శించారు. అనంతరం ప్రవీణ్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఎంపీ బోయిన్‌ పల్లి సంతోష్‌ బంధువులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు. అర్హత లేకున్నా సంతోష్‌ బంధువులకు పరిహారం ఇచ్చారన్నారు. అర్హులకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఆత్మహత్యా యత్నం చేసుకున్న బాధితుడిని పరామర్శించే సమయం అధికారులకు లేదా? అని ప్రశ్నించారు. రాజయ్యకు రావాల్సిన నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. పాలకుల వివక్షకు ఇంతకన్నా నిదర్శనం లేదన్నారు. నిర్వాసితుల పట్ల ఎంత ఉదారంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.