చికిత్స పొందుతూ మృతి చెందిన ఉద్యమకారుడు
సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్,మంత్రులుహైదరాబాద్,అక్టోబర్29( జనం సాక్షి ) తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మృతి చెందాడు.
గురువారం ఉదయం హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగ్ ప్రహ్లాద్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను నిమ్స్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం హన్మాపురం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జంగ్ ప్రహ్లాద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పలు సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ సాంస్కృతిక కృషి ఎప్పటికీ మరువలేమన్నారు. ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజా కవిగా, తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో కీలక భూమిక పోషించారని అన్నారు. జంగ్ ప్రహ్లాద్ మరణం తెలంగాణ కళాకారులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామన్నారు.