గురుకులాల ప్రారంభానికి హైకోర్టు అనుమతి

ప్రభుత్వ వినతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు

హైదరాబాద్‌,అక్టోబర్‌20 జనంసాక్షి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి ప్రభుత్వం హైకోర్టు అనుమతిని కోరింది. విద్యా సంస్థల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ ప్రసాద్‌ తెలిపారు. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్‌ బోధన చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు తెరిచేందుకు గతంలో హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, గురుకుల విద్యాలయాల ప్రారంభా నికి అనుమతి ఇవ్వలేదు. తాము ఆదేశాలు జారీ చేసే వరకు గురుకులాలను తెరవొద్దని కోర్టు ఆదేశించింది. ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో.. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కోర్టుకు ఏజీ ప్రసాద్‌ పేర్కొన్నారు.