‘మిషన్‌ కాకతీయ’కు స్కోచ్‌ అవార్డు



హైదరాబాద్‌,నవంబరు 14(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ నుంచి బెస్ట్‌ ఇరిగేషన్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది.తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ`గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్‌’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్‌ 75వ సమ్మిట్‌లో ఈ`గవర్నెన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రామాంజనేయులు ఈ అవార్డును అందుకున్నారు. మిషన్‌ కాకతీయకు అవార్డు దక్కడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌కుమార్‌, ఈఈ రామాచారి నేతృత్వంలో తయారుచేశారు.చెరువుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఎల్‌ఏఎంఎం పేరిట సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌ యాప్‌ను తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ రూపొందించింది. వీటి ద్వారా చెరువుల స్థితిగతులను, నీటి నిల్వ, పునరుద్ధరణ పనుల ప్రగతి తదితర సమచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే తెలుసుకోవడంతోపాటు మానిటరింగ్‌ చేసే వీలున్నది. తద్వారా వరద నివారణ చర్యలను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమయం, నిధులను ఆదా చేసే అవకాశం ఉన్నది.