భార్య కాపురానికి లేదని దారుణం

కొడుకును దారుణంగా చంపిన తండ్రి

జోగులాంబ గద్వాల,నవంబర్‌30(జనం సాక్షి):  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఓ తండ్రి కన్న కొడుక్కి విషమిచ్చి కిరాతకంగా చంపాడు. ఈ విషాద సంఘటన కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నందిన్నె గ్రామానికి చెందిన కురువ కర్రెప్పకు కుచినెర్ల గ్రామానికి చెందిన నరసమ్మతో వివాహమైంది. వీరికి ఏడాది బాబు భరత్‌ ఉన్నాడు. కాగా, భార్య ఇంట్లో ఉండగా కొడుకును తండ్రి తన వెంట తీసుకొని వచ్చి చిన్నారికి పురుగుల మందు తాపి భార్య దగ్గర వదిలి వెళ్లాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాబును రాయచూర్‌ హాస్పిటల్‌ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కర్రెప్పపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.