ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మారిన సవిూకరణాలు

కొత్తగా తెరపైకి మాజీ కెలక్టర్‌ వెంకట్రామిరెడ్డిమండలికి బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ బదిలీ

కడియం ఎంపికతో మండలి ఛైర్మన్‌ అంటూ ఊహాగానాలు

హైదరాబాద్‌,నవంబరు 16(జనం సాక్షి ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బండ ప్రకాష్‌, కౌశిక్‌ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేసారు. సోమవారం కలెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరికి సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే బండప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభకు మధుసూధనాచారిని పంపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీలుగా నామినేషన్‌ వేసిన వీరంతా ఏకగ్రీవం కావడం ఖాయం. ఇకపోతే వీరి ఎన్నిక తరవాత కూడా సవిూకరణాలు మారనున్నాయని అర్థం అవుతోంది. సీనియర్‌ నేతలు గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇకపోతే కడియం మండలిలో ప్రవేశించడం ఖాయం కనుక ఆయన మండలి ఛైర్మన్‌ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దళితనేతగా శాసన మండలి కొత్త చైర్మన్‌గా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూతప్రాయంగా నిర్ణయించినట్లు అప్పుడే ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు  బెర్త్‌ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్‌ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. సంఖ్యా బలం దృష్ట్యా ఆరు స్థానాలనూ టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనమే. దీనికితగినట్లుగా సీఎం కేసీఆర్‌.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించారని, ఉద్యమ నేపథ్యం, తాజా రాజకీయ`సామాజిక సవిూకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలిసింది. ఎమ్మెల్సీగా, శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో విరమణ చేసినప్పటి నుంచి మండలి పూర్తి స్థాయి చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం వి.భూపాల్‌రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం జనవరిలో ముగియనుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, మండలి చైర్మన్‌ పదవి భర్తీపైనా సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారని సమాచారం. అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు, మంచి వక్త కూడా అయిన దళితనేత కడియం శ్రీహరిని మండలి చైర్మన్‌గా సరైన వ్యక్తి అని కెసిఆర్‌ భావిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే తదుపరి ఆయన మండలి చైర్మన్‌ కాగలరు. ఇక సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి నల్లగొండ ఎంపీగా ఎన్నికైన గుత్తా, మంత్రి పదవి హావిూతోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు కుదరకపోవడంతో కేబినెట్‌ హోదాతో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియ మించారు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మండలి చైర్మన్‌ చేశారు. తాజా పరిణామాలతో గుత్తాను కేబినేట్‌లో తీసుకుంటారని  టీఆర్‌ఎస్‌ ముఖ్యులు విశ్వసిస్తున్నారు. గతంలో ఇచ్చిన హావిూమేరకు హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి, మరొకటి సీనియర్‌ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు కేటాయించారు. కౌశిక్‌ను ఇప్పటికే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మంత్రివర్గం సిఫారసు చేసింది. అయితే,  గవర్నర్‌ ఆమోదం లభించకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక రవీందర్‌రావు తొలినుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అనేకసార్లు ఆయన పేరు ఎమ్మెల్సీ పదవి కోసం వినిపించింది. కానీ, అది నిజం కాలేదు. ఎస్సీ వర్గం నుంచి ఎమ్మెల్సీ గా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. కడియంకు అవకాశం లభించడంతో  ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను దళిత బంధు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి పరిశీలించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఇప్పటికీ పేరు వినిపిస్తున్న నేతల జాబితాలో మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు,  రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మాదాటి రమేష్కుమార్‌రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, బొమ్మెర రామ్మూర్తి, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు, శ్రీహరిరావు, పీఎల్‌ శ్రీనివాస్‌, తాడూరి శ్రీనివాస్‌, చాడ కిషన్‌రెడ్డి,  ఫరీదుద్దీన్‌, తదితరులు అవకాశం కోల్పోయారు. అధిష్ఠానం ఇప్పటికే ఆశావహుల్లో కొందరిని బుజ్జగించే  యత్నాలు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది జనవరి 4న స్థానిక సంస్థల కోటాలో ఒకేసారి 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి డిసెంబరులోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు అవకాశం రానివారిని స్థానిక సంస్థల కోటాలో సర్దుబాటు చేస్తామని ఒప్పిస్తున్నారు.