పెండిరగ్‌ కేసుల రికార్డులను పరిశీలించిన డిఎస్‌పి

ఏలూరు, నవంబర్‌30(జనం సాక్షి) : ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మెలగాలని నరసాపురం డిఎస్‌పి పి.వీరాంజనేయరెడ్డి అన్నారు. మంగళవారం స్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా డిఎస్‌పి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పెండిరగ్లో ఉన్న కేసులకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. త్వరితగతిన కేసులను పూర్తి చేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిశీలించి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సలహాలు, సూచనలు అందించారు. వన భోజనాలు, జాతరల పేరట అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, గ్రామాల్లోని ప్రజలు పుణ్యక్షేత్రలకు గానీ, ఊరు వదిలి వెళ్లేటప్పుడు ఇంటిపక్క వారికి అలాగే పోలీస్‌ స్టేషన్లో తెలియజేయాలని తెలిపారు. ఏ గ్రామంలోనైనా అసాంఘిక కార్యకలాపాలు, కోడి పందేలు, గుండాట, పేకాట ఆడినా, గుట్కా, పాన్‌, గంజాయి అమ్మినా వెంటనే 100కి ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. లేనిపక్షంలో స్థానిక పోలీస్‌ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలందరూ.. పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.