12సీట్లు గెలవడం ఆనందంగా ఉంది

టిఆర్‌ఎస్‌కు తిరిగి లేదని రుజువయ్యింది: వేముల

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్నింటిని నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్‌ గెల్చుకోవడం ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మొత్తం ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్‌ జరిగిన ఆరింటిని భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉన్న ఆదరణను తెలియజేస్తున్న దన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యూహ రచన,పార్టీ శ్రేణుల కృషితో ఇంతటి ఘన విజయాలు సొంతమయ్యాయని అన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు,ఎల్‌.రమణ,దండె విఠల్‌,యాదవరెడ్డి, కోటిరెడ్డి,తాత మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలిపిన,ఓటేసిన ప్రజాప్రతినిధులకు, సహకరించిన పార్టీ ప్రముఖులకు,నాయకులకు,శ్రేణులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.