ధాన్యం సేకరణపై టిఆర్‌ఎస్‌ పట్టు

పార్లమెంట్‌ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేయాలి

రాజ్యసభలో మూడోరోజూ తగ్గని ఆందోళన

న్యూఢల్లీి,డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ నేత కే కేశవరావు స్పష్టంచేశారు. ధాన్యం సేకరణపై గందరగోళానికి సభలోనే తెరపడాలని, కేంద్ర వ్యవసాయ మంత్రి దీనిపై సభలో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేగాక ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకుని రావాలన్నారు. తాము ప్రతిపక్షంతో ఉన్నామని, రాజ్యసభలో 12 మంది విపక్ష పార్టీల సభ్యులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేకే కోరారు. రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ, పంటలకు కనీస మద్దతు ధర, ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం విషయమై సభలో నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. విపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్‌ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.