ఆస్పత్రికి లక్ష్మీనారాయణ తరలింపు

హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:  సిఐడి పోలీసులు తనిఖీకి రావడంతో బిపి డౌన్‌ కావడంతో పడిపోయిన  రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వినతికి ఏపీ సీఐడీ అధికారులు ఒప్పుకున్నారు. ఏపీ సీఐడీ విచారణలో కళ్లు తిరిగి  లక్ష్మీనారాయణ కింద పడిపోయారు. లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించేందుకు మొదట ఏపీ సీఐడీ నిరాకరించింది. లక్ష్మీనారాయణకు ఇప్పటికే రెండు సర్జరీలు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విచారిస్తున్న సమయంలో లక్ష్మీనారాయణకు బీపీ పెరిగింది. దీంతో బ్రెయిన్‌ స్టోక్ర్‌ వచ్చే ప్రమాదం ఉందనడంతో స్టార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏపీ సీఐడీ ఒప్పుకుంది. అంతకుముందు లక్ష్మీ నారాయణ ఇంటి వద్ద ఏపీ సీఐడీ అధికారులు హడావిడి చేశారు. ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ పనిచేశారు. గత ప్రభుత్వం స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా యువతకు ట్రైనింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ట్రైనింగ్‌ సెంటర్లలో అవినీతి జరిగిందంటూ  లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలకు వచ్చారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా లక్ష్మీనారాయణ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో పని మనుషులతో దురుసుగా  సీఐడీ పోలీసులు ప్రవర్తించారు. నోటీస్‌ ఇవ్వకుండా సెర్చ్‌ ఎలా చేస్తారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. దీంతో ఆయనతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు లక్ష్మీనారాయణకు టీటీడీపీ నాయకులు మద్దతుగా నిలిచారు.