ఇదేమీ చిత్రం..


గుజరాత్‌లో హఠాత్తుగా పెరిగిన కరోనా మరణాలు

` ఒకేసారి పదివేలకు పెరిగిన మృతుల సంఖ్య
దిల్లీ,డిసెంబరు 13(జనంసాక్షి):గుజరాత్‌లో కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య ఒక్కసారి సుమారు పదివేల మేర పెరిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారిక లెక్కల ప్రకారం 10,098గా ఉన్న కొవిడ్‌ మరణాల సంఖ్య 19,964కు చేరింది. కొవిడ్‌ మృతులకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన జాబితాలో ఈ విషయం వెలుగు చూసింది. గుజరాత్‌లో అసాధారణంగా పెరిగిన మరణాల సంఖ్యతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4.85 లక్షలకు చేరింది.కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్‌ ఈ సందర్భంగా అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. కొవిడ్‌ పరిహారం కోసం మొత్తం 34,678 దరఖాస్తులు వచ్చాయని, 19,964 దరఖాస్తులకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించినట్లు గుజరాత్‌ పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కొవిడ్‌ పరిహారం కోసం 87వేల దరఖాస్తులు రాగా.. 8000 కేసుల విషయంలో చెల్లింపులు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. దీనిపై ఒకింత అసహనం వ్యక్తంచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.