ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసంగోదాములు


మెదక్‌ కేంద్రంలో ప్రారంభించిన సిఇసి శశాంక్‌ గోయల్‌

మెదక్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):   ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌గోయల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సవిూకృత కలెక్టరేట్‌ సముదాయంలో రూ.కోటి 5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల గోదామును జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, అదనపు కలెక్టర్లు రమేశ్‌, ప్రతిమసింగ్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓటింగ్‌, కౌంటింగ్‌కు ఈవీఎంలు కీలకమైనవని, ఎలక్షన్‌ కమిషన్‌ కూడా ఈవీఎంల భద్రత కోసం దృష్టి సారించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం ఈవీఎం గోదాంలు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో నూతనంగా 22 గోదాముల నిర్మాణం చేపట్టి 20 గోదాములను ప్రారంభించుకున్నామని, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఈ నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. మెదక్‌లో నిర్మించిన గోదాములు ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ కోసం రూ.53 లక్షలతో హాల్‌ నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు పరిశీలించి మంజూరు చేస్తామని ఆయన హావిూనిచ్చారు. జిల్లాలో ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అనంతరం ఈవీఎం గోదాం ఆవరణలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్పీ చందనదీప్తి, డీఎస్పీ సైదులు, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంసుందర్‌, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.