మండలిలో మారిన బలాబలాలు

స్థానం కోల్పోయిన బిజెపి.. కాంగ్రెస్‌కు ఒక్కరే అభ్యర్థి

హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో శాసనమండలిలో టిఆర్‌ఎస్‌ బలం పెరగగా, బిజెకి ఇక ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్‌ బలం ఒక్కటికే పడిపోయింది. తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాయి. ఏ స్థానంలోనూ అధికార పార్టీ అభ్యర్థులకు విపక్షాలు కనీస పోటీని ఇవ్వలేకపోయాయి. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చతికిలపడ్డాయి. కారు దూకుడుకు ఆ రెండు పార్టీలు కనుమరుగయ్యాయి. తెలంగాణ శాసనమండలి లో ఆ పార్టీల అభ్యర్థులకు స్థానం లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి జీవన్‌ రెడ్డి ఒక్కరే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. మండలిలో బీజేపీకి స్థానం లేకండా పోయింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రవీందర్‌ సింగ్‌కు కేవలం 232 ఓట్లు మాత్రమే వచ్చాయి. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. మిత్రపక్షాలతో కలిపితే టీఆర్‌ఎస్‌ బలం 39కి చేరింది. ఇక శాసనసభ కూడా 95 శాతం టీఆర్‌ఎస్‌ చేతిలో ఉంది.