మెక్సికోలో ఘోరరోడ్డు ప్రమాదం


ట్రక్కు బోల్తాపడి 53  మంది మృత్యువాత

మెక్సికో,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించిన వలసదారులట్రక్కు తిరగబడటంతో వారిని మృత్యువు కబలించింది. దక్షిణ మెక్సికోలో గురువారం చోటుచేసుకున్న ఈ హృదయవిదారక దుర్ఘటనలో దాదాపు 53 మంది వలసదారులు మరణించారు. మృతుల్లో పురుషులు, మహిళలు, పిల్లలు ఉన్నారని చియాపాస్‌ సివిల్‌ ప్రొడక్షన్‌ తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చియాపాస్‌ రాష్ట్రంలోని టక్స్‌ట్లా గుటిరెజ్‌ నగరం వెలుపల ఒక పదునైన వంపులో ట్రక్కు క్రాష్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని చియాపాస్‌ సివిల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ అధిపతి లూయిస్‌ మాన్యువల్‌ గార్సియా తెలిపారు. వాహనంలో కనీసం 107 మంది ఉంటారని ప్రాధమిక అంచనా. దక్షిణ మెక్సికోలో వారిని రవాణా చేస్తున్న ట్రక్కు ఓవర్‌లోడ్‌, అతివేగం కారణంగా ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. గత నెలలో 652 మందితో అక్రమ వలసదారులతో వెళ్తున్న 6 ట్రక్కులను పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు దేశాల నుంచి మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ట్రక్కు కూడా అలాంటిదే. కాగా మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యువల్‌ లోపెజ్‌ ఒబ్రాడోర్‌ ట్విటర్‌ ద్వారా సంఘటనపై సంతాపం తెలిపారు.