త్వరలోనే పంటరుణ మాఫీని అందిస్తాం

వడ్డీతో సహా విడుదల చేస్తామన్న మంత్రి 

వనపర్తి,డిసెంబర్‌10 జనంసాక్షి:   రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. వడ్డీతో సహా విడుతల వారీగా రుణమాఫీ అవుతుందన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపంచాయతీలో మంత్రి నిరంజన్‌ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణలో ఏ ఒక్క రైతు బాకీ ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. సొంత జాగలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే రానున్నాయని తెలిపారు. ఇతర పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దు అని మంత్రి సూచించారు. ఎవడెవడో వచ్చి ఏదేదో చెబుతున్నాడు. ఎవ్వడు ఏది చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అభివృద్ధికి కట్టుబడి ఉందని నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటుందని ఉద్ఘాటించారు.