అమ్మాయిల వివాహ వయసు పెంపు



సమర్థించిన ప్రధాని మోడీ

విపక్షాల్లో ఎందుకీ వ్యతిరేకత అంటూ ప్రశ్న
లక్నో,డిసెంబర్‌21(జనం సాక్షి ): అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కన్యా సుమంగళ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు, వారికి సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం మహిళల వివాహ వయసును పెంచినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కానీ ఈ నిర్ణయం పట్ల కొందరు ఆందోళనకు గురవుతున్నట్లు ఆయన ఆరోపించారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. మహిళా సాధికారత కోసం యూపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ అన్నారు. కన్యా సుమంగళ పథకం రాష్ట్రంలోని అమ్మాయిలకు ఎక్కువగా లబ్ది చేకూర్చుతుందని తెలిపారు. యూపీ అమ్మాయిలకు ఇప్పుడు డిజిటల్‌ బ్యాంకింగ్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలకు మళ్లీ ఛాన్స్‌ ఇవ్వమన్న ఆలోచనల్లో యూపీ ఆడపడుచులు ఉన్నట్లు ఆయన తెలిపారు.