పద్మశ్రీ మొగిలయ్యను సన్మానించిన సీఎం కేసీఆర్‌


` ఇంటి స్థలంతో పాటు,గృహనిర్మాణ ఖర్చుకోసం రూ.1కోటి అందజేత
హైదరాబాద్‌,జనవరి 28(జనంసాక్షి):హైదరాబాద్‌ కిన్నెల మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు సీఎం కేసీఆర్‌ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్‌లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను కేసీఆర్‌ ప్రకటించారు. దర్శనం మొగిలయ్య తాజాగా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సీఎం కేసీఆర్‌ ఈసందర్భంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈకార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.