సర్కారు బడుల్లో ఇంగ్లీషు చదువు


` మహిళా,ఫారెస్టువర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం
` ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం
` మంత్రి సబిత నేతృత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు
` 7289 కోట్లతో ‘మన ఊరు` మన బడి ప్రణాళిక ఆమోదం
` పూర్తి ధాన్యం కొనేవరకు కొనుకేంద్రాల కొనసాగింపు
` నేడు వరంగల్‌ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో మన ఊరు` మన బడి ప్రణాళిక కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినేట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాల విద్య బలోపేతం కోసం సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ వేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియంలో విద్యా బోధనకై కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి , పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటిఆర్‌లు ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది.తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకుని రావాలని కేబినెట్‌ సమావేశం నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు.. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచారు. ఇదిలావుంటే అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ మంగళవారం పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని మంత్రిమండలికి అధికారులు వెల్లడిరచారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని వివరించారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు కేంద్రాల కొనసాగించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఇటీవల వరంగల్‌ జిల్లాలో కురిసిన వడగళ్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పడిన వర్షం వల్ల జిల్లాలో మిర్చి, మొక్క జొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. వడగళ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోనూ సుమారు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో మిరపకాయలు రాలి వరదలో కొట్టుకుపోయాయి. చిట్యాల, టేకుమట్ల, మహదేవపూర్‌, మొగుళ్లపల్లి తదితర మండలాల్లో కోసి ఆరబోసిన మిర్చి కూడా తడిచింది. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రైతులతో మాట్లాడి... తగిన భరోసా ఇవ్వనున్నారు.కాగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్‌ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది.తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు బీఎస్సీ(ఫారెస్ట్రీ) కోర్సు చదివిన వారికి అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ (ఎఫ్‌.సి.ఆర్‌.ఐ) లో బి.ఎస్సీ. ఫారెస్ట్రీ (హానర్స్‌) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్‌ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్‌ ను ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్‌.సి.ఆర్‌.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌’ (ఎ.సి.ఎఫ్‌.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 % రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌’ (ఎఫ్‌.ఆర్‌.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్‌’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ సర్వీస్‌ రూల్స్‌ (1997) మరియు తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్‌ నిర్ణయించింది. తెలంగాణలో ‘ఫారెస్ట్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినేట్‌ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్‌ కు అందించగా, వచ్చే కేబినేట్‌ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినేట్‌ ఆదేశించింది.ఇరిగేషన్‌ శాఖపై కేబినేట్‌ సుదీర్ఘంగా చర్చించింది. పలు అంశాలను ఆమోదించింది. సిద్ధిపేట జిల్లాలో.. మల్లన్నసాగర్‌ జలాశయం నుండి తపాస్‌ పల్లి జలాశయానికి లింక్‌ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్‌ పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనున్నది.వనపర్తి జిల్లాలో గోపాల్‌ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్దరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్‌ పూర్‌ బ్రాంచి కాలువ పనులకు 144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్‌ పూర్‌ మరియు అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజి నిర్మాణం పూర్తి అయింది, పంప్‌ హౌజ్‌ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో భీమ్‌ పూర్‌, జైనథ్‌, భేలా, ఆదిలాబాద్‌ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. మెదక్‌ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించబడిన ఘన్‌ పూర్‌ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోధించింది. ఈ ప్రాజెక్టు కింద మెదక్‌ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రి వర్గం ఆమోధించింది. వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్‌ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్‌ పహాడ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపనీస్‌ ఆక్ట్‌ 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటును మంత్రివర్గం ఆమోధించింది. ఈ కార్పొరేషన్‌ కు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఛైర్మన్‌ గా వ్యవహరిస్తారు.దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్‌ హౌజ్‌, కాలువ పనులకుÑ గుండ్ల సాగర్‌ నుంచి లౌక్య తండా వరకు పైప్‌ లైన్‌ పనులకుÑ నశ్కల్‌ జలాశయం వద్ద పంప్‌ హౌజ్‌ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.