7 నుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

7న గవర్నర్‌ ఉభసయసభల్లో ప్రసంగం
9, 10 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు
11 లేదా 14 తేదీల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   ఏపీ వార్షిక బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. మార్చి 7న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ.2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బ్జడెట్‌ ఉండే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్‌పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తయ్యింది. ఈసారి బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ హాజరవుతుందా లేదా అనే అంశంపై స్పష్టత కరువైంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణంగా చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. అప్పట్లో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు.