8,9 తేదీల పాలిటెక్నిక్‌ పరీక్షలు రద్దు


ఈ నెల 15,16 తతేదీల్లో నిర్వహణ

స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కేంద్రం రద్దు
హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రశ్నపత్రాల లీకేజీపై తెలంగాణ సాంకేతిక విద్యామండలి విచారణ చేపట్టింది. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించిన ఎగ్జామ్స్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ఎస్‌బీటీఈటీ గుర్తించింది. బాటసింగారంలోని స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీలో ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు నిర్దారించారు. దీంతో 8, 9వ తేదీల్లో జరిగిన పరీక్షలను సాంకేతిక విద్యామండలి రద్దు చేసింది. రద్దయిన పరీక్షలను ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కూడా రద్దు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలేజీకి షోకాజు నోటీసులు జారీ చేశారు. కాలేజీ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని విద్యామండలి ప్రశ్నించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలేజీకి చెందిన ముగ్గురు సిబ్బందిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను సాంకేతిక విద్యామండలి కోరింది. కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ అబ్జర్వర్‌ను సస్పెండ్‌ చేశారు. అయితే ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు జిల్లా కాలేజీల ప్రిన్సిపల్స్‌ గుర్తించారు. క్వశ్చన్‌ పేపర్‌ను వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపినట్లు నిర్దారించారు.