మంచినీటి సమస్యపై సర్పంచ్‌లు దృష్టి పెట్టాలి

 వికారాబాద్‌,ఫిబ్రవరి21: వేసవి తొంగి చూస్తున్నందున ఇప్పటికే గ్రామాల్లో నీటి సమస్యలు మొదలయ్యాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సర్పంచ్‌లు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ అన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సర్పంచ్‌లకు సూచించారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నీటి సరఫరా చేస్తానన్నారు.ఈ మేరకు తనవంతుగా సహాయం అందచేస్తానని అన్నారు. అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా మన్నారు. ఆసరా పింఛన్లు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వకుండా, లైన్‌మెన్‌, వాటర్‌ గ్రిడ్‌, ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులు పేర్లు, వారి సెల్‌ నెంబర్లు రాయవల్సిందిగా సూచించారు. నిర్మాణంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టేలా పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. జిల్లా అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఇల్లా అభివృద్ధి ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి విషయంలో రాజీలేదని, అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు.