ఎక్కడ కరువున్నా..తెలంగాణలో ఉండదు


కాళేశ్వరం ఎత్తిపోతలతో మారిన ముఖచిత్రం
మల్లన్న సాగర్‌ అతిపెద్ద జలాశయంగా నిర్మాణం
ఎందరో అడ్డుపడ్డా మల్లన్న సాగర్‌ పూర్తిచేసుకున్నాం
వేలాదిమంది కార్మికులు..వందల మంది అధికారుల శ్రమకు ప్రతిరూపం
మంత్రి హరీష్‌ రావు శక్రమ కూడా మరువలేనిది
పరిహారంలో అన్యాయం జరిగిన వారి కోసం మరో వందకోట్లు
పర్యాటక ప్రాంతంగా అద్భుత అవకాశాలు ఉన్నాయి
మల్లన్న సాగర్‌ ప్రారంభించాక మాట్లాడిని సిఎం కెసిఆర్‌
సిద్దిపేట,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  దేశంమొత్తం కరువున్నా..ఇక తెలంగాణలో మాత్రం కరువుఛాయలే రావని సిఎం కెసిఆర్‌ అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఈ ప్రాంతం నిరంతరా యంగా జలాలను అందిస్తుందని అన్నారు. ప్రాజెక్టులతో పాటు,చెరువులను,కుంటను నింపుకోవడంతో ఇక వ్యవసాయానికి కూడా ఢోకా ఉండబోదన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో కొందరికి నష్టపరిహారంలో ఇంకా అసంతృప్తులు ఉన్నాయని అన్నారు. ఎందరో త్యాగంచేసి భూములు అందించారు. కొన్ని గ్రామాలను కోల్పోయాం. అలాంటి వారికి ఇంతపెద్ద ప్రాజెక్టు సందర్భంగా వారు దుఃఖించడం సరికాదు. మరో వంద కోట్లు అయినా ఫర్వాలేదు. అలాంటి వారికి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. ఇంతపెద్ద ప్రాజెక్టులో అదో చిన్న మొత్తమేనని అన్నారు. వారు సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇది ఒక మల్లన్న సాగర్‌ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉందన్నారు. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్‌ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టంగా అభివర్ణించారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢల్లీిలో ఉన్నాను. అక్కడ్నుంచే మన రాష్ట్ర చీఫ్‌ జస్టిస్‌కు ఫోన్‌ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 600 పైచిలుకు కేసులు వేశారు. ఇంజినీర్లు పదవీ విరమణ పొందినా కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు. ఇంజినీర్లు అందరికీ సెల్యూట్‌. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారని మండిపడ్డారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎంతో మనసు పెట్టి ముందుకు పోయాం. హరీశ్‌రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పని చేశాం. ఇది ఒక మల్లన్న సాగర్‌ కాదు.. తెలంగాణ జన హృదయం సాగరం అన్నారు. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా
హైదరాబాద్‌ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇక బోర్లలో నీరు ఉండదనే సమస్యరాదన్నారు. చిన్నిచిన్నపొరపాట్లు జరిగినా ప్రాజెక్టును అనుకున్న లక్ష్యంతో ముందుకు సాగామన్నారు. ఇటు మల్లన్న సాగర్‌ వద్ద దుబాయ్‌ బురుజును మించేలా ఇక్కడ కలర్‌ ఫౌంటేన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ మల్లన్నసాగర్‌, పక్కనే కొమురవెల్లి మల్లన్న, మరోవైపు యాదాద్రి నిర్మాణంతో ఈ ప్రాంతం అద్భుతంగా ఉండబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయ్‌ అయిన మల్లన్న సాగర్‌ లోకి నీటిని విడుదల చేశారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ఛాన్‌ చేసి నీటిని రిలీజ్‌ చేశారు. రిజర్వాయర్‌ ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు.
రాష్ట్రంలోని ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌. సిద్దిపేట జిల్లా తొగుట,కొండపాక మండలం సరిహద్దులో దీనిని నిర్మించారు. 8 గ్రామాలతో పాటు మొత్తం 14 శివారు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. దీని సామర్థ్యం 50 టీఎంసీలు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంప్‌ హౌస్‌ కు చేరిన గోదావరి జలాలను మల్లన్న సాగర్‌ లోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్‌ తో మొత్తంగా ఉమ్మడి మెదక్‌ తో పాటు ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోని దాదాపు 11.29 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ఈ రిజర్వాయర్‌ కు 5 తూములు(స్లూయిజ్‌ లు) ఉన్నాయి. వీటి ద్వారా కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌ కు, సింగూర్‌ ప్రాజెక్టుకు, తపాస్‌ పల్లి రిజర్వాయర్‌ కు,మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు. అంతేగాకుండా హైదరాబాద్‌ తాగునీటి కోసం 20 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం16 టీఎంసీలు వాడుతారు.