సీసీకెమెరాలతో సులువుగా నేరాల గుర్తింపు


కేసుల పరిష్కారంలోనూ కీలకంగా ఫుటేజి

నిందితుల పట్టివేతలో తోడ్పడుతున్న దృశ్యాలు
శాంతి భద్రతల పరిరక్షణలోనూ ముఖ్య భూమిక
కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించే చర్యలు
హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనం సాక్షి): శాంతి భద్రతల పరిరక్షణలో సీసీకెమెరాల పాత్ర కీలకంగా మారింది. అందుకే వీటిని ఏర్పాటుఏ చేసేందుకు హైదరాబద్‌ సహా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానం చేస్తారు. అప్పుడు జిల్లాల్లో కూడా ఎప్పుడు ఏం జరిగినా ఇట్టే పసిగట్టే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పుడు కేసుల విచారణ కూడా సులువుగా మారింది. దీంతో ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటవుతున్నాయి. అలాగే కొందరు ఔత్యాహికుల ద్వారా కూడా ఏర్పాటు చేచిస్తున్నారు. ఇటీవల అనేక కేసుల్లో సిసి కెమెరాల ఫుటేజీ బాగా పనికి వస్తోంది. నేరస్తులను గుర్తించి పట్టుకోవడంలో అవి కీలకంగా మారాయి. కేసులను పసిగట్టి కూపీ లాగడంలోనూ బాగా పనికి వస్తున్నాయి. అందుకే కాలనీలు మొదలు,రోడ్లకు ఇరువైపులా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు. దాతల నుంచి సహకారం తీసుకుని సిసి కెమెరాల ఏర్పాటును చేయిస్తున్నారు. సిసి కెమెరాలు ఉన్నచోట జరిగే నేరాల్లో త్వరాగా ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి కూడా ప్రకటించారు. ఇకపోతే నగరంలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు గతంలోనే డిజిపి తెలిపారు. ప్రజా భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతోనే గొలుసు చోరీలను నివారించ గలిగినామని మహేందర్‌ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాలు అలసిపోయేవి కావని, 24గంటలు పనిచేస్తూనే ఉంటాయని, దీని ద్వారా నేరగాళ్ల ఆచూకిని త్వరగా గుర్తించే వీలుంటుందన్నారు. పోలీస్‌ సిబ్బంది ఉన్న ఎనిమిదిగంటల మాత్రమే నిఘా ఉండగలరని, అంతకుమించి ఉండే పరిస్థితి ఉండదన్నారు. ఒకవేళ నేరగాళ్లను గుర్తించిన కేసుల సమయంలో సాక్ష్యులుగా వీరు ఉండలేరని, అదే సీసీ కెమేరాలైతే నిజనిర్దారణ వేగంగా అవుతుందన్నారు. కోర్టుల్లో కూడా సీసీ కెమెరాల ద్వారా ఎటువంటి సంశయం లేకుండా శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయని డీజీపీ తెలిపారు. అందుకే నగరంలో అన్ని ప్రాంతాల్లో ఈ సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్టాన్న్రి నేరరహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తున్నది. దానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నది. దేశంలోనే తెలంగాణ పోలీసింగ్‌కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. దానిని కాపాడుకుంటూ మరింత పేరుపొందేలా, ప్రజల్లో భరోసా కల్పించేలా ముందుకు సాగుతున్నారు. ఇటీవల అనేక కేసుల పరిష్కారంలో సిసి కెమెరాల ఫుటేజీ కీలకంగా మారింది. కేసులను ఛేదించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. గతంలో అనేకానేక కేసులను సిసి కెమెరాల ద్వారా పరిష్కరించారు.