మహతిలో వైభవంగా సంగీతోత్సవాలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడిరచారు.ఎస్వీ నాదస్వరం డోలు పాఠశాల విద్యార్థులు మంగళకరంగా నాదస్వరం, డోలు వాయిద్య సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మోహనకృష్ణ, పవన్‌కుమార్‌, రూపేశ్‌ అనే విద్యార్థులు భక్తిగీతాలను ఆలపించారు. కళాశాల పూర్వ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైవిఎస్‌.పద్మావతి, వారి శిష్యులు లక్ష్మి, కె.పి.రాధిక బృందం ఆలపించిన భక్తి సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌, అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.