ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ రెడీ చేస్తున్న బోర్డు


ఫిబ్రవరిలో ప్రీఫైనల్‌ పరీక్షలు..మార్చిలో ప్రాక్టికల్స్‌

ఏప్రిల్‌లో వార్షిక పరీక్షల నిర్వహణకు కసరత్తు
అమరావతి,ఫిబ్రవరి1(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌లో జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఫిబ్రవరిలోనే ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చిలో ప్రాక్టికల్స్‌, ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు సూచనప్రాయంగా చెప్పారు. ఇతర పరీక్షలు, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఒకేరోజున రాకుండా ఉండేలా షెడ్యూల్‌ రూపొందిస్తామన్నారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అవసరాలకోసం జిల్లాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు. కోవిడ్‌ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుకాకపోవడం వంటి
కారణాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తక్కిన 70 శాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించినందున ఆ మేరకు పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కు ఉపయోగపడేలా కంటెంట్‌ రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని శేషగిరిబాబు చెప్పారు. ఈ మెటీరియల్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకే కాకుండా జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌, అడ్వా న్స్‌, నీట్‌, ఏపీఈఏపీసెట్‌ వంటి వాటికి కూడా ఉపయోగ పడుతుందని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చిలో పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్న ట్లు శేషగిరిబాబు చెప్పారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు జంబ్లింగ్‌ ఉండదని, ఎగ్జామినర్లను జంబ్లింగ్‌ విధానంలో నియమించనున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమలు, వివిధ సంస్థలు, పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయంగా ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ దిశగా ఇంటర్మీడియట్‌ బోర్డులోని ఎడ్యుకేషన్‌ రీసెర్చి ట్రయినింగ్‌ వింగ్‌ (ఈఆర్టీడబ్ల్యూ)ను బలోపేతం చేస్తున్నట్లు తెలి పారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి అధ్యయనం, సిఫార్సుల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ప్రతినిధులు, ఐఐటీల ప్రొఫెసర్లు, ఎన్‌సీఈఆర్టీ ప్రముఖులు, ఈఆర్టీడబ్ల్యూ ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. జనరల్‌ కోర్సులతో పాటు వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్న కమిటీ.. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేర్పులకు సిఫార్సులు చేస్తుందని వివరించారు