కోమటిరెడ్డిని నివాసంలో కలిసిన రేవంత్‌


కాంగ్రెస్‌ పోరాటాలపై ఇరు నేతల చర్చ

మోడీ కోవర్టుగా పనిచేస్తున్న కెసిఆర్‌ అంటూ ఫైర్‌
పుట్టనరోజు ముందయినా నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న కోమటిరెడ్డి
హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జనం సాక్షి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి అధ్యక్షుడిగా నిమామకమైన తరువాత మొదటి సారి మంగళవారం రేవంత్‌ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో కలసి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి దగ్గరకు రేవంత్‌ రెడ్డి స్వయంగా వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బలమైన సంకేతాలు ఇచ్చేందుకే రేవంత్‌ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విూడియాతో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌ మోడీ కోవర్ట్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పార్టీలను కేసీఆర్‌ చిల్చే ప్రయత్నం చేస్తున్నారని, మోడీ కోసమే కేసీఆర్‌ పనిచేస్తున్నారన్నారు. థర్డ్‌ ఫ్రంట్‌ కాదు సుఫారీ గ్యాంగ్‌ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మే ప్రసక్తే లేదని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎప్పటికీ కలవబోవని ఆయన స్పష్టం చేశారు. విూ బర్త్‌డేకు ముందు ఉద్యోగ నోటిఫికేసన్లు ఇవ్వండని ఆయన అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ..నిరుద్యోగుల బలిదానాలతో సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు లేక.. రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనీసం తన పుట్టిన రోజు సందర్భంగానైనా నోటిఫికేషన్స్‌ ఇవ్వాలని ఆయన సూచించారు. ధనిక రాష్ట్రమన్న సీఎం ధాన్యం కొనలేడా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం మూడు నియోజవర్గాలే రాష్ట్రమా అని నిలదీశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగువేయక తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటామన్నారు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌ కు నోటిఫికేషన్లుగుర్తుకొస్తాయని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మూడు డీఎస్సీలు ప్రకటించాడని.. అదే ప్రత్యేక తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్‌ ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం తన పుట్టిన రోజునాడైనా కేసీఆర్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు.