కాళేశ్వరానికి గుండెకాయ మల్లన్న సాగర్‌

టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల

హైదరాబాద్‌,ఫిబ్రవరి23( (జనం సాక్షి)): తెలంగాణ నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి కొమురవెల్లి మల్లన్న సాగర్‌ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భారీ రిజర్వాయర్‌ మల్లన్న సాగర్‌లోకి అధికారికంగా నీటిని సీఎం కేసీఆర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో పది జిల్లాలకు తాగు, సాగు నీరు అందనుందన్నారు. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, జనగామ, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని దాదాపు 12 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ జల సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.