ఉక్రెయిన్‌ యుద్దంలో విషాదం


కర్నాటకకు చెందిన మెడికల్‌ విద్యార్థి మృతి

కీవ్‌ నగరం నుంచి బయటపడే క్రమంలో మృత్యువాత
మృతి చెందిన విద్యార్థి నవీన్‌గా గుర్తింపు
క్షిపణి దాడిలో మరణించినట్లు విదేశాంగ శాఖ ధృవీకరణ
కీవ్‌ను కాళీ చేయాలని భారతీయలకు ఆదేశాలు
న్యూఢల్లీి,మార్చి1 (జనం సాక్షి) : ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి.. వారిని త్వరగా దేశానికి తరలిస్తున్న క్రమంలో విషాదం చోటు చేసుకుంది. కీవ్‌ లోని ఖార్కివ్‌ ప్రాంతంలో ఒక భారతీయ విద్యార్థి క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయాడని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ధృవీకరించింది. ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేసింది. ఖార్కివ్‌లో జరిగిన క్షిపణి దాడిలో నవీన్‌ అనే విద్యార్థి మరణించాడు. కర్ణాటకు చెందిన నవీన్‌ ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్‌ తన అపార్ట్‌మెంట్‌ నుండి రైల్వే స్టేషన్‌ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్‌ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. విదేశీ మంత్రిత్వ శాఖ అతని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని విదేశంగా శాఖా ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. ఖార్కివ్‌లో, ఇతరఘర్షణ ప్రాంతాలలో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విదేశాంగ కార్యదర్శి కోరారు.
మరోవైపు రష్యా బలగాలు కీవ్‌ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీవ్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా వెంటనే కీవ్‌ను వదిలివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు కీవ్‌లో ఉన్న భారతీయులంతా ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని భారత ఎంబసీ తన ట్వీట్‌లో తెలిపింది. అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ నగరాన్ని తక్షణమే విడిచి పెట్టి వెళ్లాలని కోరింది. ఏ క్షణమైనా కీవ్‌ నగరంపై భీకర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు
భారతీయ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్‌ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆపరేషన్‌ గంగాకు వాయుసేన కూడా తోడవ్వనున్నది. ఆపరేషన్‌ గంగా కోసం వాయుసేనకు చెందిన సీ`17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది.