కొత్తపేట మార్కెట్‌ తెరవండి

వ్యాపారులు తమ సామాగ్రితీసుకుని వెళ్లనీయండి

ఆదేశాలు జారీచేసిన హైకోర్టు
హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి) : గడ్డి అన్నారం కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ను వెంటనే తెరవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, మార్కెట్‌లో ఉన్న సామాగ్రీ తీసుకోవడానికి మాత్రమే ఓపెన్‌ చేయాలని సూచించింది.. బాటసింగారంలో మార్కెట్‌ యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పండ్ల మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని సెప్టెంబర్‌ 25న మూసివేసిన విషయం తెలిసిందే కాగా.. ఒక్కసారిగా మూసివేయడంతో మార్కెట్‌లోనే ఫర్నిచర్‌, ఏసీ సామగ్రి ఉండిపోయింది.. దీంతో, వాటిని తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు మార్కెట్‌ సిబ్బంది.. అంతే కాదు, బాటసింగారం మార్కెట్‌లో వసతులు లేవని, ప్రభుత్వం హడావుడి చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మార్కెట్‌ సిబ్బంది. ఆ పిటిషన్లపై మరోసారి విచారించిన హైకోర్టు.. ఈ సందర్భంగా గతంలో కోర్టు ఇచ్చిన సమయం పూర్తయినా.. ఇంకా మార్కెట్‌ తెరవలేదని కోర్టుకు తెలిపారు సిబ్బంది.. దీంతో, కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. వెంటనే మార్కెట్‌ ఓపెన్‌ చేసి సిబ్బంది సామాగ్రి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఇక, హైకోర్టు ఆదేశాలతో 160 రోజుల తర్వాత కొత్తపేట పండ్ల మార్కెట్‌ తెరుచుకుంది.. మరోవైపు, ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.