లాలూ ఇంటికి నితీష్‌.. ` ఇది దేనికి సంకేతం` రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ


పాట్నా,ఏప్రిల్‌ 23(జనంసాక్షి): బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరు కావటం బిహార్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.2017లో లాలూ నివాసంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన నితీశ్‌.. ఐదేళ్ల తర్వాత మరోసారి ఒకప్పటి మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత ఇంట్లో జరిగిన వేడుకకు హాజరుకావటం విశేషం. ఇఫ్తార్‌ విందుకు హాజరైన సీఎం నితీశ్‌.. రబ్రీదేవితో పాటు లాలూ కుమారులు తేజస్వీ, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌తో ఫొటోలు దిగారు.అవినీతి ఆరోపణల కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రaార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే నితీశ్‌ కుమార్‌.. లాలూ ఇంట్లో జరిగిన ఇఫ్తార్‌ విందుకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది. అయితే, మరోవైపు ఇఫ్తార్‌ విందుకు హాజరుకావటంపై వస్తున్న ఊహాగానాలను నితీశ్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఇఫ్తార్‌ విందుకు చాలా మంది ఆహ్వానిస్తుంటారని, వెళ్లడానికి రాజకీయాలకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. ఆర్‌?జేడీ నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు హాజరై.. భాగస్వామ్య పక్షమైన భాజపాకు పరోక్ష సందేశం పంపారన్న ఊహాగానాలను నితీశ్‌ తోసిపుచ్చారు.