గువాహటి : భారత పౌరులను గుర్తించే 'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)' శనివారం ఉదయం 10 గంటలకు 3.11 కోట్ల మందిని అసోం పౌరులుగా గుర్తించినట్లు పేర్కొంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 3 కోట్ల పదకొండు లక్షల మందిని మాత్రమే భారత పౌరులుగా గుర్తించింది. దీంతో దాదాపు 19 లక్షల మంది వేల మందికి ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో వారు ఇకపై విదేశీయులుగా గుర్తింపబడనున్నారు. కాగా అసోం ఎన్ఆర్సీ తుది జాబితా నేడు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకర పరిస్థితులు తలెత్తే క్రమంలో రాష్ట్ర పోలీసులతో పాటు దాదాపు 218 భద్రతా బలగాలను కేంద్రం అసోంలో మోహరించింది. ఇక ఎన్ఆర్సీ తుది జాబితా వెల్లడి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం ఉంటుందని, వారు విదేశీయుల ట్రిబ్యునల్కు అప్పీలు చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే వారిలో ఎక్కువ మంది ముస్లింలు, అందులోనూ బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాంలో 3 కోట్ల మంది పౌరులు.. 19 లక్షల మంది అనర్హులు