రాజధాని అమరావతే!


- గతంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు
- త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తాం
- అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : గత కొద్దిరోజులుగా ఏపీ రాజధాని అంశంపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు మంగళవారం తెరదించుతూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఏపీ అసెంబ్లీలో రెండోరోజు ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరిగింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టత ఇవ్వాలని.. కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై అయోమయం ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. కొత్త రాష్టాన్రికి తప్పనిసరిగా రాజధాని ఉండాలని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని.. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. టీడీపీ హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. ఇక ఇండియా మ్యాప్‌లో అమరావతిని గుర్తించకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని బొత్స వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని చెప్పడం శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బావుంటుందని టీడీపీ చెబుతుంది.