మంచు విష్ణు,మోహన్‌బాబులపై హెచ్చార్సీలో ఫిర్యాదు

సినీనటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, ’మా’ అధ్యక్షుడు విష్ణుపై నాయీ బ్రాహ్మణ సంఘాలు మంచి పడుతున్నాయి. విష్ణు హెయిర్‌ స్టైలిస్ట్‌ నాగశ్రీను రూ. లక్షలు విలువ గల వస్తువులు దొంగతనం చేశారని ఇటీవల జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు నాగశ్రీను కూడా వివరణ ఇచ్చారు. కులం, వృత్తి పేరుతో దుర్భాషలాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నాగశ్రీనుతోపాటు బీసీలందరికీ మంచు కుటుంబం క్షమాపణ చెప్పాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణుపై నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన నాయీ బ్రాహ్మణ కులాన్ని మోహన్‌ బాబు, విష్ణు తక్కువ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి ఆ సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్‌ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు.