దిశ నిందితుల.. ఎన్‌కౌంటర్‌పై విచారణ!


- ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను నియమించిన సుప్రీంకోర్టు
- ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌కు ఆదేశం
- కమిషన్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచన
- ఎన్‌కౌంటర్‌ వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు
- సుప్రీంకు వెల్లడించిన ప్రభుత్వ తరపు న్యాయవాది
- నిజానిజాలు ప్రజలకు తెలియాలి 
- ఎన్‌కౌంటర్‌ తీరుపై అనుమానాలను తొలగించాల్సిన అవసరముందన్న సీజేఐ
న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రెండో రోజు గురువారం విచారణ ముగిసింది. ఈ మేరకు ఉన్నత స్థాయి విచారణకోసం ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్‌ను నియమించింది. వీరిలో విశ్రాంత న్యాయమూర్తులు వీఎస్‌ సిర్పుర్కార్‌, రేఖ (బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి), మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్‌లను ధర్మాసనం నియమించింది. ఈ కమిషన్‌కు వీఎస్‌ సిర్పుర్కార్‌ నాయకత్వం వహించనుండగా, వీరికి సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పిస్తుందని ధర్మాసనం వెల్లడించింది. అంతేకాక, కమిషన్‌కు అయ్యే ఖర్చులను కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. ఈ కమిషన్‌ హైదరాబాద్‌లో సరైన ప్రదేశంలో ఉండి విచారణ జరపాలని కోర్టు సూచించింది. తొలి విచారణ మొదలు పెట్టిన తేదీ నుంచి ఆరు వారాల్లో సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలని సీజేఐ ఆదేశించారు. అంతేకాక, ఈ కేసు విచారణలో విూడియాతోపాటు సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఏర్పర్చాలని సీజేఐ ఆదేశించారు. వాదనల్లో భాగంగా ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై విచారణ కమిటీని నియమిస్తామని కోర్టు వెల్లడించింది. అయితే, దీనిపై ఇప్పటికే సిట్‌ దర్యాప్తు మొదలైందని, ఎన్‌హెచ్‌ఆర్సీ కూడా విచారణ చేసిందని తెలంగాణ తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ముకుల్‌ రోహద్గీ కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ మరో ఉన్నత స్థాయి కమిటీ విచారణ అవసరం ఉందా? అనేది పరిశీలించాలని రోహద్గీ కోర్టుకు విన్నవించారు. నిందితులు చేసిన 
ఎదురు దాడి, వారు పారిపోతున్న తీరుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తొలుత పిటిషనర్‌ను ప్రశ్నించిన ధర్మాసనం.. ఇందులో విూకు ఆసక్తి ఎందుకని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ. బాబ్డే ప్రశ్నించారు. అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఎన్‌కౌంటర్‌ అయినందువల్లే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని పిటిషనర్‌ మండి స్పష్టం చేశారు. దీనిపై పూర్తి సమాచారం ప్రభుత్వం నుంచి రాబట్టాలని మండి ధర్మాసనాన్ని కోరారు. ఘటన జరిగిన సమయంలో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదని, ఆ స్థలంలో ఎవరెవరు ఉన్నారని సీజేఐ ప్రశ్నించారు. దీనికి తెలంగాణ తరపున వాదనలు వినిపిస్తున్న మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహద్గీ వాదనలు వినిపిస్తూ.. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును ప్రతి సన్నివేశాన్ని వివరించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల వద్ద తుపాకీలు లాక్కొని కాల్పులు జరిపారా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి ముకుల్‌ రోహద్గీ సమాధానమిస్తూ.. వారు తుపాకీలు లాక్కొని పోలీసులపైకి కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని, కానీ వారి బల్లెట్లు పోలీసులకు తగలలేదని, తూటాలు గురి తప్పాయని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై అనుమానాలున్నాయని, ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు.