కర్నూలుకు జ్యుడిషయల్‌ రాజధాని

శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు న్యాయం: ఎస్వీ మోహన్‌ రెడ్డి


కర్నూలు,డిసెంబర్‌18(జ‌నంసాక్షి): కర్నూలు నగరాన్ని జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారమే కర్నూలుకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల వల్ల వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో పథకం ప్రకారం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపి బినావిూ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. అమరావతిలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల మేరకు అభివృద్దిపథంలో దూసుకుపోతున్న జగన్‌ను చూసి చంద్రబాబు కడుపు రగిలిపోతోందనీ, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మతిభ్రమించి అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చూపించాలని లోకేష్‌బాబును కోరారు. మరోవైపు సర్పంచ్‌కు కూడా అర్హత లేని జనసేన అధినేత గురించి మాట్లాడుకోవడం వృథా అని తేల్చి చెప్పారు.