జేసీ దివాకర్‌రెడ్డికి మరోషాక్‌

- మరో ఆరు బస్సులను సీజ్‌ చేసిన ఆర్టీఏ అధికారులు


అనంతపురం, డిసెంబర్‌31 (జనం సాక్షి)  : మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వరుస షాక్‌లు తగులుతున్నాయి. మరోసారి రవాణాశాఖ అధికారులు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై సోదాలు జరిపారు. తాజాగా జరిపిన తనిఖీల్లో.. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేశారు. ఈ బస్సుల్ని అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. గతంలో కూడా రెండు, మూడు సార్లు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తమ బస్సులను అక్రమంగా సీజ్‌ చేశారంటూ జేసీ దివాకర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేసిన ట్రావెల్స్‌ బస్సులను రిలీజ్‌ చేయాలని వారం క్రితమే ఆదేశించింది. తర్వాత బస్సులు కూడా బయటకు రాగా.. మళ్లీ ఇప్పుడు రిలీజ్‌ చేసిన బస్సుల్లోనే కొన్ని బస్సుల్సి సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కక్షసాధిస్తోందని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు.. కొందరు నేతల్ని సీఎం టార్గెట్‌ చేసుకున్నారని.. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 80 బస్సులు సీజ్‌ చేశారన్నారు. 74ఏళ్ల ట్రాన్స్‌పోర్ట్‌లో తనకు అనుభవం ఉందని.. ఒక్క దివాకర్‌ ట్రావెల్సే నిబంధనలు 


అతిక్రమించిందా అంటూ ప్రశ్నించారు. మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారు.. ట్రిబ్యునల్‌ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదన్నారు. తమను పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. తాము పార్టీలో చేరితే కేసులుండవని చెబుతున్నారని ఆరోపించారు.