బిపిన్‌ రావత్‌పై మహా బాధ్యత 


త్రివిధ దళాలకు అధిపతిని నియమించడం ద్వారా కొత్త అడుగు పడింది. బిపిన్‌ రావత్‌ నేతృత్వంలో తొలి మహాదళం ఏర్పడింది. ఇంతకాలం త్రివిధ దళాలను సమన్వయం చేసేందుకు అవకావం లేకుండా పోయింది. కానీ తాజా నిరర్ణయంతో ఇప్పుడు మన రక్షణరంగ వ్యవస్థ మారనుంది. అలాగే దేశ రక్షణకు అనువుగా నిర్ణయాలు తీసుకునే అవకావం ఏర్పడింది. ఇంతకాలం త్రివిధ దళాలకు ఏ సమస్యలు ఉన్నా విడివిడిగా ప్రధాని, రక్షణమంత్రి సమావేశం కావాల్సి వచ్చేది.  ఆ విభాగాలకు ఎదురవుతున్న సమస్య లేమిటో, వాటిని తీర్చడానికి అనుసరించాల్సిన విధానమేమిటో తెలుసుకోవాలంటే ఈ ముగ్గురితో విడివిడిగా సమావేశం కావాల్సి వచ్చేది. రక్షణ దళాల అధిపతి నియామకంతో ఆయన ఆ మూడు విభాగాలనూ పర్యవేక్షిస్తూ, వాటికి కావలసిన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి, సాధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వగలుగుతారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత ఈ సీడీఎస్‌ నియామకం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందుకోసం మంత్రుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో త్రివిధ దళాధిపతుల మధ్య ఏకాభిప్రాయం లేక మూలనబడింది. అయితే ఉన్నతాధికార ణం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందని సమాచారం. సీడీఎస్‌ నియామకంతో అధికారాలన్నీ ఆయన వద్దనే కేంద్రీకృతమవుతాయని, తమ మాటకు విలువుండదని రక్షణ శాఖ ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నారని చెబుతారు. కారణమేదైనా ఆ ప్రతిపాదన ఆగిపోయింది. సర్వాధికారాలూ సీడీఎస్‌లో కేంద్రీకృతమైతే ఆ పదవిలో వుండేవారు శక్తిమంతులుగా మారతారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని కొందరు వాదిస్తారు. అయితే ప్రపంచంలో 68 దేశాల్లో సీడీఎస్‌ వ్యవస్థ చాన్నాళ్లుగా అమల్లోవుంది. యుద్ధ సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు గుర్తించాకే అవన్నీ సీడీఎస్‌కు మొగ్గుచూపాయి. పైగా ఇప్పుడు సైనిక రంగంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ధ రీతులు పూర్తిగా మారాయి. వేగంగా ముగిసే మెరుపు యుద్దాలు, పరిమిత కాలంపాటు మాత్రమే కొనసాగే ఘర్షణలు రివాజయ్యాయి. అణ్వాయుధాలు సరే... రిమోట్‌ కంట్రోల్‌ ఆయుధాలు, ద్రోన్‌లద్వారా లక్ష్యాలు ఛేదించడం, కృత్రిమ మేధతో పని చేసే స్వయంచాలిత ఆయుధాలు రంగంలోకొచ్చాయి. అయితే అప్పటినుంచీ అడపా దడపా రక్షణ నిపుణులు దీనిపై పునరాలోచించమని ప్రభుత్వాన్ని కోరుతూనేవున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల కమిటీ ఒకటి పనిచేస్తోంది. ఇకపోతే యుద్ధం వచ్చే పక్షంలో శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అనువుగా రక్షణ దళాలను తీర్చిదిద్దడం, వాటికి అవసరమైన సమస్త సరంజామా, యుద్ద అవసరాలను అందుబాటులో ఉంచడం ఏ దేశానికైనా తప్పనిసరి.  యుద్ధ నిపుణుల అభిప్రాయం ప్రకారం శత్రువే చాలాసార్లు యుద్దాన్ని నిర్ణయిస్తాడు. కనుకనే మన త్రివిధ దళాలను స్వతంత్రంగా పర్యవేక్షించడానికి రక్షణ దళాల అధిపతి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ సీడీఎస్‌ని నియమించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు అది అమల్లోకి తీసుకుని వచ్చారు. ఆర్మీచీఫ్‌గా పదవీ విరమణ చేసిన బిపిన్‌ రావత్‌ తొలి చీఫ్‌గా కూడా నియమితులయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పుడు అనేకమంది దాన్ని స్వాగతించారు. ఇంతకాలం త్రివిధ దళాల అధిపతులు ఎవరికివారు వారివారి విభాగాల నిర్వహణలో తలమునకలై ఉంటూ సమస్య వచ్చినప్పుడు ప్రధాని లేదా రక్షణ మంత్రితో చర్చించే వారు. ఇప్పుడా అవసరం ఉండదు. వారు తమ చీఫ్‌కు సమస్యను విరించడంతో పాటు అతడిచ్చే ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న విధానంలో సైన్యం, వైమానికదళం, నావికాదళం ఈ మూడూ ఖరారు చేసే ప్రతిపాదనలు రక్షణ కార్యదర్శి వద్దకు వెళ్లడం, దానిపై ఆయన తన అభిప్రాయాన్ని జోడించి రక్షణమంత్రికి ఇవ్వడం, 


చివరిగా అత్యున్నత స్థాయిలో తుదినిర్ణయం తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే రక్షణ దళాల అవసరాలను అర్ధం చేసుకుని, ప్రభుత్వం వాటిని తీర్చే క్రమంలో ఉన్నతాధికార వ్యవస్థ పెను అడ్డంకిగా వున్నదని త్రివిధ దళాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి వుంది. జవాన్లకు మెరుగైన ఆయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రి సకాలంలో సమకూరడానికి ఉన్నతాధికార గణం ఆమోదం తప్పనిసరి కావడం, వారు క్షేత్రస్థాయి స్థితిగతుల్ని పరిగణన లోకి తీసుకోకుండా జాప్యం చేయడం పెను సమస్యగా వున్నదని రక్షణ సిబ్బంది తరచు ఫిర్యాదు చేస్తున్నారు. వాస్తవానికి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే సీడీఎస్‌ ప్రతిపాదన చర్చ కొచ్చిందని సమాచారం. ఆఖరి గవర్నర్‌ జనరల్‌గా పనిచేసిన లార్డ్‌ మౌంట్‌బాటన్‌ నెహ్రూతో దీన్ని ప్రస్తావించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని అప్పట్లో విమర్శలు కూడా


 వచ్చాయి. అప్పటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ కె.ఎస్‌. తిమ్మయ్యను సీడీఎస్‌గా నియమిస్తే బాగుంటుందని కూడా ఆయన సూచించారట. కానీ జనరల్‌ తిమ్మయ్య విషయంలో నెహ్రూకు అభ్యంతరం వుండటం వల్ల కావొచ్చు... ఆయన అందుకు అంగీకరించలేదని అంటారు. దాని పర్యవసానాలు 1962 చైనా యుద్ధంలో దేశం చవిచూసింది. అప్పట్లో త్రివిధ దళాల మధ్య సమన్వయలోపంతో స్వల్పకాలంలోనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే సీడీఎస్‌ పదవి సృష్టించడంతో ఇప్పుడు సమన్వయం సులువు కానుంది. అలాగే సైనిక దళాల వ్యవస్థను ఆధునీకరించే అవకౄవం ఏర్పడింది. దళాల అన్నిటి మధ్యా సమన్వయం సాధించేలా, ఒకే  కమాండ్‌కింద పనిచేసేలా పునర్వ్యవస్థీకరించడం అవసరం. రక్షణ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం కూడా ఉంది. భద్రతకు సంబంధించిన అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుచూపుతో వ్యవహరించగల పటిష్టమైన వ్యవస్థ రూపొందిచి దేశాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చుకోవడంఅవసరం. పాక్‌, చైనాల నుంచి పొంచి ఉన్న ముప్పులకు అనుగుణంగా మార్పులు తీసుకోవాలి. సమర్థుడైన అధికారికగా పేరున్న బిపిన్‌ రావత్‌ ఆ పని చేస్తారనడంలో సందేహం లేదు.