నేనంటే నేనే ...నేడే ‘పుర’ఫలితాలు 







కల్వకుర్తి,జనంసాక్షి : కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికలు బుధవారంతో ముగిసాయి.ఈ మున్సిపాలిటీలో  ఆయా పార్టీల నాయకులు,అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.కానీ,ఎవరు గెలుస్తారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది.అభ్యర్థులు భవితవ్యం ప్రస్తుతం స్ట్రాంగ్ రూములో నిక్షిప్తమైంది.షెడ్యూల్ వెలువడింది  మొదలు తెరాస పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చిందని చెప్పవచ్చు.రిజర్వేషన్ల ప్రకటన,ఎన్నికల నోటిఫికేషన్ తదితర అంశాల్లో ఆచితూచి వ్యవహరించిందని సుస్పష్టంగా చెప్పవచ్చు..రిజర్వేషన్ల ఖరారు,నామినేషన్లకు తక్కువ తక్కువ సమయం ఇవ్వడంతో అధికారపార్టీ మినహా మిగితా పార్టీల వారికీ అభ్యర్థులు ఎంపిక విషయంలో సమయం సరిపోలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.జనవరి 7  నుంచి 10 వరకు మాత్రమే నామినేషన్ల గడువు విధించడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది.కానీ రిజర్వేషన్ల  విషయం తెరాసకు ముందే తెలిసిందని,రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆయా పార్టీల నాయకులు ఆరోపిస్తూ వచ్చారు.ఫలితంగా అధికార పార్టీ తమ అభ్యర్థులను ముందే ఎంపిక చేసిందనే విమర్శలు వినిపించాయి.నోటిఫికేషన్ కు,నామినేషన్లకు తక్కువ సమయం ఉండటం వల్ల టిఆర్ఎస్ మినహా మిగితా పార్టీలో అభ్యర్ధుల ఎంపిక గందర గోళంగా మారింది.జనాల్లో పలుకుబడితో పాటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవగలిగే అభ్యర్థులనే ఎంపిక చేశారనేది జనాల్లో వినికిడి వినిపిస్తుంది.టికెట్లు దక్కని వారు రెబల్ పోటీలో నిలబడ్డారు.అయితే రెబల్ గా పోటీచేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టిఆర్ఎస్ ముందునుంచే చెప్తుంది.కానీ పలు వార్డుల్లో రెబల్ అభ్యర్థులు పోటీచేశారు.కాంగ్రెస్ లో రెబల్స్ బెడద ఎక్కువగా లేకున్నా ఉన్న అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో వ్యవహరించింది.22 న నిర్వహించిన ఎన్నికల్లో అక్కడక్కడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మొత్తం మీద 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

గెలుపుపై నాయకుల్లో ధీమా.....

కల్వకుర్తి పోలింగ్ ముగియడంతో నాయకులు తామే గెలుస్తామంటూ ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు ప్రలోభాలు కొనసాగాయి.ఇక టిఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు బాధ్యత స్థానిక నాయకులు,ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలను వివరాలను ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారంలో చేసారు.అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్,ఇతర పార్టీల నాయకులు ప్రజలకు తెలిసేటట్టుగా ప్రచారం ఎక్కువగా చేశామని,ఆరు సంవస్సరాలలో అధికారపార్టీ మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విషయం ప్రజలకు అర్థం అయ్యిందని కాబట్టి జనాలు కాంగ్రెస్ ను గెలిపిస్తారనే అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

టిఆర్ఎస్ వ్యూహం ఫలించేనా...?

ముందు నుంచే ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా తామే గెలవాలని అధికార టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ వచ్చింది.గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంతో పంచాయితీ,ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ గెలుపు సునాయాసమైంది.రైతుబంధు,రైతుభీమా,ఆసరా వంటి పథకాల పేరుతో ఓట్లు సంపాదించారు.ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు వర్తించవని ప్రచారం చేయడంతో చాలామంది ఓటర్లు భయంతో తెరాస కు ఓటు వేశారు అనేది గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి.కానీ మున్సిపాలిటీలో ఇలాంటి వ్యూహాలు వర్తించే అవకాశాలు లేవు.ఎందుకంటే పట్టణ ఓటర్లు చైతన్యవంతులు,ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను గమనిస్తుంటారు.కావున వారి ఎవరికి ఓటు వేశారనే విషయం శనివారం నాడు ఫలితాలు వెలుబడే వరకు తెలియదు.ముందు నుంచే గెలుపు కోసం వ్యూహాలు రచించిన తెరాస...తమ అభ్యర్థులు గెలుస్తారో లేదోనని లోలోపల మథన పడుతున్న బయటకు మాత్రం అన్ని స్థానాల్లో  గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనేది సమాచారం.ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఈ సారి రసవత్తరంగా మారాయి.ఈ ఎన్నికలలో ప్రజా తీర్పు ఎలా వెలుబడబోతుందో అని అభ్యర్థుల మనస్సులో ఉత్కంఠ నెలకొంది.కల్వకుర్తి మున్సిపాలిటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి సరైన నాయకులను ప్రజలు ఎన్నుకుంటారా...అనే దానిపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి.అధికార పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాని ఫలితంగా ఓట్లు తమకే వేశారని,తామే గెలుస్తామని ఇతర పార్టీల నాయకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి గెలుపెవరిది విషయం తెలియాలంటే నేడు వేచి చూడాల్సిందే.......