నేడు, రేపు వర్షాలు ..
 


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జ‌నంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్‌ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. సోమ, మంగళవారాలు కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు పడుతుండటంతో గాలిలో తేమ శాతం మళ్లీ పెరిగింది. కాగా, పత్తి రైతులు మాత్రం అధిక వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి సత్తుపల్లిలో అత్యధికంగా 83.5 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 73.5 మి.మీ వర్షపాతం నమోదైంది.