జీఎస్టీ బకాయిలు చెల్లించండి


- రూ. 2,638 కోట్లు రావాలి
-  మంత్రి హరీష్‌
హైదరాబాద్‌,అక్టోబరు 1(జనంసాక్షి): తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో డిమాండ్‌ చేశారు. ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు ఎంసీహెచ్‌ఆర్డీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో గ్రూఫ్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సభ్యులైన ఢిల్లీ, చత్తీస్‌ ఘడ్‌, పంజాబ్‌, తమిళనాడు, ఒడిశా ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. రాష్ట్రానికి ఎంత  ఐజీఎస్టీ రావాల్సి ఉందన్న విషయంపై మాకు స్పష్టత ఉంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 25 వేల 58 కోట్లు ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని గ్రూఫ్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ జీఎస్టీ కౌన్సిల్‌ కు సిఫారసు చేయాలి. తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన రూ. 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. గతంలో  ఈ మొత్తాన్ని 25 వేల 58 కోట్లు కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ లో నిబంధలకు విరుద్ధంగా జమ చేశారన్న విషయాన్ని పార్లమెంట్‌ లో కాగ్‌ ఎత్తి చూపిన న విషయాన్ని ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌ రావు ప్రస్తావించారు. కాగ్‌ సైతం  ఈ విషయంలో తప్పు పట్టింది కాబట్టి ఎలాంటి చర్చ లేకుండా  రాష్ట్రాలకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్న సిఫారసును  గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఈ నెల ఐదో తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్‌  ఎజెండాలో ఉండేలా చూడాలని కోరారు.
అంగీకారం తెలిసిన ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ కన్వీనర్‌
అందుకు ఐజీఎస్టీ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్‌ కన్వీనర్‌, బీహార్‌ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ అంగీకారం తెలుపుతూ, రాష్ట్రాలకు ఐజీఎస్టీ మొత్తం ఇవ్వాలన్న సిఫారసును ఈ రోజే తయారు చేసి పంపాలని అధికారులను  ఆదేశించారు.2017-2018లో, తిరిగి 2018-2019లో ఇదే తప్పు జరిగిందన్న విషయాన్ని కాగ్‌ మొన్న పార్లమెంట్‌ లో బహిర్గతం చేసిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 208-19లో 13 వేల 944 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని  కేంద్రంమళ్లీ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ లో జమ చేయడాన్ని కాగ్‌ మరో మారు తప్పు పట్టిందన్నారు. ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలన్న ఆయన తెలంగాణకు ఇందులో 210 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. 
ఐజీఎస్టీలో సెటిల్మెంట్‌ బేస్డ్‌ ఆన్‌ ఆన్వల్‌ రిటర్న్స్‌ కింద రాష్ట్రానికి మరో వెయి కోట్లు రావాల్సి ఉందన్న మంత్రి హరీశ్‌ రావు జీఎస్టీ కౌన్సిల్‌ ఈ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ సమావేశంలో కోరారు.  ఈ సమావేశంలో  ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య, పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌, ఆర్థిక, వాణిజ్య, పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.