మంత్రి మల్లారెడ్డిని మంత్రి వర్గము నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర గవర్నర్ కు లేఖ


 హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):మంత్రిగా ఉండి అసభ్యంగా తొడకొట్టి పరుష పదజాలము తో దూషిస్తూ, పి.సి.సి.అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ రేవంత్ రెడ్డి పై సవాలు విసిరిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని గవర్నర్ వెంటనే మంత్రివర్గము నుండి బర్తరఫ్ చేయాలి.హుందాగా ఉండాల్సిన మంత్రులే టి.అర్.ఎస్ పార్టీ ఆపీస్ లో వీధి రౌడిల్లా అసభ్యకరముగా ప్రవర్తిస్తూ మాట్లాడటము క్షంతవ్యము కాదు.మల్లారెడ్డి హాస్పిటల్ మరియు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ భవనాల ప్రాంతాలను చూస్తేనే అవి ఆక్రమించుకున్నవా? కాదా తెలుస్తుంది.వేరే ఋజువులక్కర లేదు.గొప్పగా చెప్పుకునే మల్లారెడ్డి కాలేజీలు ఉన్నవి విద్యాదానానికి కాదు. కాని అవి ఉన్నయి ధనార్జనకే.ఆయన కాలేజిలలో ఆయన ఏ విధముగా సీట్లు అమ్ముకునేది జగమెరిగిన సత్యము.నిన్న మల్లారెడ్డి స్వయానా తనకు 600 ఎకరాల భూమి ఉన్నదని వాటినన్నిటినీ డబ్బిచ్చి కొన్నానని చెపుతున్నందున, వాస్తవాలను నిగ్గు తేల్చటానికి, ఈటెల రాజేందర్ భూములపై విచారణ జరుపటానికి అధికారుల కమిటీ వేసినట్లు ఒక అధికారుల కమిటీని హైకోర్ట్ న్యాయ మూర్తి పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలి.దినదినము ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ఆదరణ చూసి కె.సి.ఆర్ కు ఆయన మంత్రులకు వణుకు పుడుతున్నది. అందుకే ఈ ఉలికిపాటు. తొడగొట్టుడు.ప్రజాస్వామ్యములో ప్రతి రాజకీయపార్టీకి ఏ ప్రాంతా నికైనా వెళ్లి తమ వాణిని వినిపించే హక్కు రాజ్యాంగము ప్రసాదించింది.నియంతృత్వములో, రాచరికములో లేమని గ్రహించాలి.గజ్వేల్ కు రానీయమనే హక్కు ఎవరికీ లేదు. అడ్డంకులు సృష్టించే వారిపై డి.జి.పి ముందస్తు చర్యలకు ఆదేశించాలి.కె.సి.ఆర్, కె.టి.ఆర్ ల పర్యటనలుంటే కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేసే పోలీసులు, కాంగ్రెస్ నాయకుల పర్యటనలుంటే టి.అర్.ఎస్ వారిని అరెస్ట్ చేసి తమ నిష్పక్షపాతతను నిరూపించుకోవాలి.ఒక వైపు 7 ఏళ్ళ పరిపాలన పై ప్రజలు పెదవి విరుస్తుంటే మరొక వైపు కె.టి.ఆర్ 20 ఏళ్ళూ మేమే పరిపాలిస్తామంటుంటే ప్రజలు ముక్కు పై వేలేసుకుంటున్నారు అని టి.పి.సి.సి. సీనియర్ ఉపాధ్యక్షులు జి.నిరంజన్ తెలిపారు.