ఏపీ నిరాధారమైన వాదన పట్టించుకోవద్దు


కేఆర్‌ఎంబీ కి మరో లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌21 (జనంసాక్షి)  :  కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మెన్‌ కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మంగళవారం లేఖ రాశారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ చేసిన నిరాధారమైన వాదనలు పట్టించుకోవద్దని కేఆర్‌ఎంబీ కి ఈఎన్‌సీ సూచించారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని ఏపీ గతంలో కోరింది. గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని కేఆర్‌ఎంబీ కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీ స్పందించారు. కృష్ణా నీరు ఇవ్వని ప్రాంతానికే గోదావరి నీటిని మళ్లిస్తున్నామని తెలిపారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందన్నారు.మిగులు నీటిని ఎగువ ప్రాజెక్టుల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. తక్కువ నీటి మళ్లింపునకు టెలీమెట్రీలు అవసరం లేదని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి ట్రైబ్యునళ్ల ప్రకారం అదనపు వాటా కిందికి కూడా రాదని తెలిపారు..