దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ హౌజ్ అరెస్ట్
హైదరాబాద్,అక్టోబర్29 (జనంసాక్షి): సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడికి చేసిన హెచ్చరికల నేపథ్యంలోదుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడారు. వరి విత్తనాలు వేస్తే..ఊరుకునేది లేదని యాసంగిలో వరి పంటను వేయవద్దని, డీలర్లు వరి విత్తనాలు అమ్మితే లైసెన్సు రద్దు చేస్తామని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు మండిపడ్డారు. కలెక్టర్ ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నాడని రఘునందన్ రావు అన్నారు. కలెక్టర్ మాట్లాడిన తీరు బాధకలిగించిందన్నారు. కలెక్టర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే శుక్రవారం ఉదయం 12 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. రఘునందన్ రావు పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై 300 మంది బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.